హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి రానుపోను ప్రయాణం(రౌండ్ ట్రిప్)కు ఒకేసారి టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్లో బస్భవన్లో ఉన్నతాధికారులతో సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీస్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలకు ఎండీ సూచించారు. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,233 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. ఇందులో 585 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరుకు 83 బస్సులు, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20 బస్సులు నడుపుతున్నట్లు ఎండీ వెల్లడించారు.
ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరతాయని తెలిపారు. ఏపీ నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయవాడ 54, విశాఖపట్నం 19, అమలాపురం 23, శ్రీకాకుళం 9, ఏలూరు 11, రాజమండ్రి 12, గుంటూరు 29, బాపట్ల 5, చీరాల 7, మచిలీపట్నం 5, గుడివాడ 6, తెనాలి 4, రాజోలు 9 ప్రత్యేక బస్సులు నడపనున్నామని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవీందర్, ఈడీలు వినోద్ కుమార్, మునిశేఖర్, యాదగిరి వెంకటేశ్వర్లు, పురుషోత్తం, సీటీఎం జీవన్ప్రసాద్ పలువురు ఆర్ఎంలు, డీఆర్ఎంలు పాల్గొన్నారు.