TSRTC | సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పండుగ సమయంలో 4,844 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 625 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు.
అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరూ డీవీఎం ర్యాంక్ అధికారులను ఇన్ఛార్జులుగా నియమించామని.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని వివరించారు. ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోందని, ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు.
ఛార్జీల పెంపు లేదు
సంక్రాంతికి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్లను నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకొని ప్రయాణించాలని సూచించారు.