హైదరాబాద్: మేడారం మహా జాతరకు (Medaram) తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరుతూ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
‘తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం.
రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపుతున్నది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటున్నది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!!
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024