హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఆవేశంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్లో మంగళవారం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్పై దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు.
ఈ ఘటనపై ఇప్పటికే ఆందోల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని, దాడుల ఘటనలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.