హైదరాబాద్ : పద్మ శ్రీ అవార్డు వరించిన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్యకు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ సేవలను, పబ్లిక్ ట్రాన్స్పోర్టును ప్రోత్సహిస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం కల్పిస్తున్నందుకు మొగులయ్యకు ధన్యవాదాలు తెలుపుతూ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీలోనే ప్రయాణించాలని మొగులయ్య పలుచోట్ల తన కిన్నెరతో పాటలు సైతం పాడిన సంగతి తెలిసిందే. మొగులయ్య పాటకు ముచ్చటపడిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.
అంతరించిపోతున్న మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వారసత్వంగా అందిపుచ్చుకోవడమే కాదు.. ఏకంగా ‘12 మెట్ల కిన్నెర’ను సృష్టించిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీతో సముచిత సత్కారం లభించింది. తన వాద్యాన్నే ఇంటిపేరుగా మార్చుకొని ‘కిన్నెర మొగులయ్య’గా స్థిరపడిన ఆయన కిన్నెరతో రాగాలు పలికించగల అతికొద్ది మందిలో ఒకరు. 12 మెట్ల కిన్నెరను వాయిస్తూ సంతలు, జాతర్లలో జీవనం గడిపిన మొగులయ్యకు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్తింపు లభించింది. 2016లో మొగులయ్య ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. కేసీఆర్ చేతుల మీదుగా ఆయన ఉగాది పురస్కారం అందుకొన్నారు. ఇటీవలే సెభాష్ భీమ్లానాయకా.. అంటూ భీమ్లానాయక్ సినిమా టైటిల్ సాంగ్లో మొగులయ్య తన కిన్నెర వాయిస్తూ పాడిన పాట అందరినీ ఆకట్టుకొన్నది.
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసులకుంట దర్శనం మొగులయ్య స్వస్థలం. ఐదు తరాల కళాకారుల వంశం. తాత ముత్తాతల నుంచి కిన్నెర వాయించేవారు. వారి నుంచి కళను నేర్చుకొని, పల్లె ఒడినే సంగీత బడిగా మార్చుకొని రాగాలు పలికించారు. తరతరాల తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని ఒడిసిపట్టి పాటల రూపంలో కిన్నెర మెట్ల ద్వారా మొగులయ్య ప్రచారం చేశారు.