TSRTC | రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి బాధిత కుటుంబానికి భరోసా నింపింది.
తాండూరు డిపోలో పనిచేసే కండక్టర్ లక్ష్మణ్ గత ఏడాది జూన్ 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శిక్షణ నిమిత్తం హకీంపేటలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్తున్న సమయంలో ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందాడు. పెద్ద దిక్కు మరణించడంతో ఒంటరిగా మారిన కండక్టర్ కుటుంబాన్ని యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ ఆదుకుంది. ప్రమాదంలో ఎవరైనా ఉద్యోగి మరణిస్తే సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద కనీసం రూ.40 లక్షల వరకు ( ఉద్యోగి వేతనం ప్రకారం ) యూబీఐ అందిస్తోంది. ఈ క్రమంలో రూ.40 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అందజేశారు. ఈ సందర్భంగా కండక్టర్ లక్ష్మణ్ భార్య జ్యోతి, కుమారుడు అనిల్కుమార్ టీఎస్ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలియజేశారు.