హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. ఈ లకీ డ్రాలో గెలుపొందిన మహిళలకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులను అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురు చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది. ఈ నెల 30, 31 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లకీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లలో వేయాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
ఆ డ్రాప్ బాక్స్లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లకీ డ్రా నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపికచేసి సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. మహిళా ప్రయాణికులందరూ ఈ లకీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని, సెప్టెంబర్ 9లోగా లకీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ రాఖీ పౌర్ణమి లకీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.