హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇబ్బంది లేకుండా బస్సు ఎక్కడున్నదో, ఎప్పుడొస్తుందో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. అత్యాధునిక ఫీచర్లతో ‘గమ్యం’ అనే పేరుతో బస్ ట్రాకింగ్ యాప్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ యాప్ను శనివారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించామని చెప్పారు.
జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ట్రాకింగ్లో ఉన్నాయని, అక్టోబర్ నుంచి మిగతా సర్వీసులను యాప్కు అనుసంధానం చేస్తామని తెలిపారు. సిటీ బస్సుల వివరాలను రూట్ నంబర్ ద్వారా, దూరప్రాంత సర్వీసుల వివరాలను రిజర్వేషన్ నంబర్ ఆధారంగా ట్రాకింగ్ చేయవచ్చని వెల్లడించారు. TSRTC Gamyam పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నదని, సంస్థ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.