ప్రగతిరథ చక్రాలు ఆపసోపాలు పడుతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. కనీసం తీసుకున్న రుణాలు చెల్లించడానికి కూడా అవస్థలు పడాల్సి వస్తున్నది. వడ్డీల కిదే ఏటా రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. దీంతో ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఫలితంగా ఏటేటా ఆర్టీసీ ఆస్తులు తరుగుతున్నాయి.
Mahalakshmi Scheme | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతున్నా, ఆదాయం మాత్రం తగ్గుతూ వస్తున్నది. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ మరింత ఎకువైంది. ఈ పథకం అమలుకు ముందు బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) 65-68 శాతం ఉంటే, ఇప్పుడు తరచూ 100 శాతం దాటుతున్నది. ఫిబ్రవరిలో ఏకంగా 114.28 శాతం, 108.38 శాతంగా నమోదైంది. గతంలో 8 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను తుకుగా మార్చేవారు. ఇప్పుడు 14-15 లక్షల కిలోమీటర్లు దాటినా వాటినే నడుపుతున్నారు.
పాత బస్సులు పలుసార్లు బ్రేక్డౌన్ అవుతున్నాయి. అయినా సంస్థకు రోజువారీ వచ్చే ఆదాయం మాత్రం పెరగడం లేదని, నిర్వహణ సమస్యలు సైతం అధికం కావడంతో తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నదని మెకానిక్లు వాపోతున్నారు. కెపాసిటీ పెరిగి అధిక లోడ్ కారణంగా బస్సులు దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడూ కొత్త బస్సులు వస్తున్నా మొత్తం బస్సులతో పోలిస్తే వాటి సంఖ్య అరకొరగానే ఉంటుంది. పాత బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడంతో పాటు పెరిగిన రద్దీకి తగ్గట్టు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నది. ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 9,200 (అద్దెబస్సులు సహా) బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 5,000 బస్సులకు పైగా పాతవే.
భారీ అప్పుల్లో టీఎస్ఆర్టీసీ
ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న ఆర్టీసీ అతికష్టం మీద రూ.1000 కోట్ల రుణాలను తీసుకున్నది. గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగినా, నేరుగా వచ్చే ఆదాయం రూ.450 కోట్ల నుంచి రూ.270 కోట్లకు తగ్గినట్లు తెలుస్తున్నది. మహాలక్ష్మి పథకం ‘జీరో’ టికెట్ల కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే అప్పు ఇచ్చే బ్యాంకులు మాత్రం ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి నేరుగా వచ్చే ఆదాయాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఏప్రిల్ నాటికి సంస్థ సుమారు రూ.10 వేల కోట్ల నష్టాల్లో ఉన్నది. దీనికి తోడు బస్సుల నిర్వహణ వ్యయమూ పెరిగింది. సంస్థ ఆదాయం పెరిగినా అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగిపోయాయి.
ఉద్యోగుల భవిష్యనిధికే 1,450 కోట్ల బాకీ
ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నాటి పీఆర్సీకి సంబంధించి 50 శాతం బాండ్ల రూపంలో చెల్లించాల్సిన బకాయిలతోపాటు 2017, 2021 పీఆర్సీలను అమలు చేయాల్సి ఉంది. ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) కింద ఆర్టీసీ యాజమాన్యం సుమారు రూ.1,450 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సొమ్ముతోపాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటా ధనాన్ని చెల్లించకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికసాయం సకాలంలో అందడం లేదు. అలాగే ఉద్యోగులు ఏ కారణంతోనైనా మృత్యువాత పడితే.. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ సీం కింద రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వచ్చే ఆర్ధికసాయమూ నిలిచిపోయింది.
కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి 1,080 కోట్ల బకాయి
ఆర్టీసీ ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంస్థ యజమాన్యం సుమారు రూ.1,080 కోట్లు బకాయి పడింది. ఎస్ఆర్బీఎస్ కింద ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సుమారు రూ.400 కోట్లను యాజమాన్యం దారి మళ్లించింది. కొన్నేండ్లుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వడ్డీ కింద తీసుకొచ్చిన రుణాలు సుమారు రూ.4 వేల కోట్లకు చేరుకోగా, వడ్డీల కింద ఏటా రూ.750 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. అంతేకాకుండా రవాణా శాఖకు మరో రూ.780 కోట్ల బకాయిలు, ఉద్యోగుల పీఆర్సీ బాండ్ల బకాయిలు రూ.450 కోట్ల వరకు ఉన్నాయి.