హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు రూ.80కే టీ-24 టికెట్ను అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్ప్రెస్ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించేలా సాధారణ ప్రయాణికులకు టికెట్ ధరను రూ.90గా, సీనియర్ సిటిజన్లకు రూ.80గా ఇటీవల ఆర్టీసీ తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకు రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టీ-24 టికెట్ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన టీ-24 టికెట్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ధర తగ్గింపు తర్వాత రోజు సగటున 40 వేల వరకు టీ-24 టికెట్లు అమ్ముడవుతున్నాయని చెప్పారు.
విభిన్న వర్గాలకు మేలు చేకూరేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టీ-6 టికెట్ను ఇటీవల ప్రారంభించింది. రూ.50తో టీ-6 టికెట్ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ప్రయాణించవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ను అందుబాటులోకి తెచ్చింది. వీకెండ్స్, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి ఎఫ్-24 టికెట్ కొనుగోలు చేస్తే.. నలుగురు వ్యక్తులు 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది.