TSRTC | హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో మెదక్ డిపోకు చెందిన కండక్టర్ సీహెచ్ అంజయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విధులు ముగించుకుని తన స్వగ్రామం నాగపూర్కి బైక్పై వెళ్తుండగా.. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లోని టీ టైమ్ వద్ద అతన్ని మరో బైక్ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడటంతో అంజయ్య మరణించాడు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ ఆదుకుంది.
ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగుల శాలరీ అకౌంట్లను టీఎస్ ఆర్టీసీ ఇటీవల యూనియన్ బ్యాంక్కు మార్చింది. ఈ ఖాతాలకు ఉచిత ప్రమాద బీమా కల్పించింది. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబానికి యూబీఐ రూ. 40 లక్షల వరకు ప్రమాద బీమాను అందజేస్తుంది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించిన అంజయ్య కుటుంబానికి రూ.40 లక్షల ఆర్థికసాయం అందజేశారు. హైదరాబాద్ బస్భవన్లో అంజయ్య భార్య మణెమ్మ, కుమారుడు సంతోశ్కు రూ.40 లక్షల చెక్కును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అందజేశారు.