హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర సర్కారు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్ ఆర్టీసీ చట్టం-2023కు గవర్నర్ ఆమోదం తెలుపడంతో సెప్టెంబర్ 15 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు నోటిఫికేషన్లో వెల్లడించిం ది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న నియమ నిబంధనలు యథావిధిగా అమలు జరుగుతాయని స్పష్టంచేసింది. ఆర్టీసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 43,045మంది ఉద్యోగులను ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. విలీనం గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం ఇతర అంశాలు, అంటే నియ మ నిబంధనలు, ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ, వైద్యం, సంక్షేమం, వేతన సవరణలపై స్పష్టత వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.