హైదరాబాద్ : పాదయాత్ర పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు షర్మిల తెలంగాణలో అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజాప్రతినిధులను దుర్భాషలాడటమే పనిగా పెట్టుకున్నారని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. గతంలో ఇలా వ్యవహరించినందుకు హైకోర్టు మొట్టికాయలు వేసిన గుర్తు చేసిన ఆయన.. ఏది పడితే అది మాట్లాడొద్దని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని గతంలోనే హైకోర్టు హెచ్చరించినా వాటిని షర్మిల పెడచెవిన పెట్టారని విమర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను పాటించని షర్మిలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
ప్రజలు ఎన్నుకున్న నాయకులపై కనీస గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని పోగెట్టేలా షర్మిల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆమె తీరు నచ్చక తెలంగాణ పల్లెల్లో ప్రతి చోటా స్థానికులు ఆమెను అడ్డుకొని నిలదీస్తున్నారన్నారు. తెలంగాణకు ఆమె తండ్రి రాజశేఖర్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారని. తెలంగాణపై ఒకప్పుడు విషం చిమ్మిన షర్మిలకు ఇప్పుడు ఇక్కడ పని ఏంటని అని ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారని సతీశ్రెడ్డి పేర్కొన్నారు.
పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు వస్తున్న షర్మిలను తమ గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వమని ప్రజలు అడ్డుకుంటున్నారని, దీంతో మరో మార్గం లేక షర్మిల కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. వివాదాలు గొడవలు సృష్టించి తన పెయిడ్ మీడియాలో పబ్లిసిటీ కోసం షర్మిల ఇదంతా చేస్తున్నారన్నారు. పబ్లిసిటీ కోసమే గతంలో ప్రగతిభవన్లోకి కారుతో చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారని, పోలీసులు అడ్డుకోవడంతో రోజంతా హైడ్రామా నడిపించారని ఇదంతా ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని ఆరోపించారు. షర్మిల చేస్తున్న చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఆమోదించరని, ఆమె ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.