హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త భవనాలు అభివృద్ధి కాదంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంటే గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని అనుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను, పాలనను మెరుగుపరిచేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ భవనాన్ని, జిల్లాల్లో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాలను, సాగునీటి కష్టాలు తీర్చేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రపంచం నివ్వెరాపోయేలా నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని గవర్నర్ వ్యతిరేకిస్తున్నారా అని నిలదీశారు.
గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని గవర్నర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. జాతి నిర్మాణం అంటే ఏంటో కాస్త వివరంగా చెప్పగలరా అని గవర్నర్ తమిళిసైని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలు చేస్తున్న అభివృద్ధి అంతా జాతి నిర్మాణంలో భాగం కాదా, భారత దేశంలో తెలంగాణ లేదా? కేవలం రాజ్భవన్ మాత్రమే జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటోందా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ దిశగా గవర్నర్ ఇకనైనా పనిచేయాలని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 సందర్భంగా అయినా తీరు మార్చుకోవాలని ఆయన కోరారు. బీజేపీ చేతిలో పావుగా ఉండడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు.