హైదరాబాద్: వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. అహంకారంతోనే ఆమె మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పాలకులను టెర్రరిస్టులని, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడిన షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చి అవమానించారని మండిపడ్డారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా శాంతియుతంగా సాగిన ఉద్యమాన్ని షర్మిల ఉగ్రవాదంతో పోల్చడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. వైఎస్ కుటుంబం తెలంగాణ వ్యతిరేకని విమర్శించారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.
తెలంగాణను ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్తో పోల్చిన షర్మిలకు గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆమెపై గవర్నర్ ఎందుకు సానుభూతి చూపిస్తున్నారని నిలదీశారు. తమిళిసై తెంగాణకు గవర్నరా లేదా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్కా అనేది చెప్పాలన్నారు. గవర్నర్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా..? లేకపోతే బీజేపీ దానికి అనుకూలంగా, అనుబంధంగా పనిచేస్తున్న ఇతర పార్టీల కోసం పనిచేస్తున్నారో సమాధానమివ్వాలన్నారు.