TSPSC | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ డీ మహేశ్ సహా 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్పై జస్టిస్ పీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. ఇదే నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గిరిధర్రావు, నర్సింగ్ చెప్పారు. ఈ దశలో గ్రూప్-2ను వాయిదా వేయాలని పిటిషనర్ వినతిపత్రం ఇచ్చినా కమిషన్ స్పందించలేదని తెలిపారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్రావు కోర్టుకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారని, ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందని వివరించారు.
గ్రూప్-2 పరీక్షకు ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో గురుకుల పరీక్షలు రాస్తున్నది సుమారు 60 వేల మందేనని చెప్పారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకు మే 23న, గురుకుల బోర్డు పరీక్షలకు మార్చిలో నోటిఫికేషన్లు రాగా, వీటన్నింటి కంటే ముందే ఫిబ్రవరిలోనే గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైందని గుర్తు చేశారు. గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు 9 విభాగాల్లో 2.63 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఏ రెండు పరీక్షలకూ అవరోధం లేకుండా పరీక్షల షెడ్యూళ్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుంటే కేవలం 150 మంది మాత్రమే కోర్టుకు వచ్చారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం గురుకుల పరీక్షలు రాస్తున్నది కొందరు అభ్యర్థులే అయినా వారికీ అవకాశం ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. కోర్టుకు అందరూ రాలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల వినతిపై నిర్ణయం ఈ నెల 14లోపు చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు.