TSPSC | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్ 2 పరీక్షను ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలోనే నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. ఆగస్టు 29, 30న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. 783 ఉద్యోగాలకు 5,51,943 మం ది దరఖాస్తు చేసుకొన్నారు. అంటే.. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీపడుతున్నారు. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి ఇప్పటికే పలుమార్లు సభ్యుల భేటీలో చర్చించారు. గ్రూప్-2 పరీక్ష పూర్తయితే ఇక.. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్తోపాటు గ్రూప్-3 పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. గ్రూప్-3, గ్రూప్-1 రెండు పరీక్షలను అక్టోబర్, నవంబర్ నెలల్లో పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది.
ఆగస్టు 29, 30న గ్రూప్ -2 పరీక్షలు జరిగే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవలే మెమో జారీచేశారు. పరీక్షాకేంద్రాలు లేని విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.