హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను బుధవారం సిట్ కస్టడీకి తీసుకొని తొలిరోజు వారి లింక్లపై ఆరా తీసింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి, టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న రమేశ్, షమీమ్తోపాటు మాజీ ఉద్యోగి సురేశ్కు అందించారు. రమేశ్, షమీమ్తోపాటు సురేశ్ను మరో నాలుగురోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. కమిషన్లో పనిచేస్తున్న మొత్తం 26 మంది ఉద్యోగులు గ్రూప్-1 పరీక్ష రాశారు. మిగతా ఉద్యోగులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. గ్రూప్-1లో 100 మార్కులు దాటిన సుమారు వంద మంది విచారణను సిట్ పూర్తి చేసింది. రాజశేఖర్రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్లో ఉండటంతో అతనికి కూడా ప్రశ్నపత్రం పంపించి, పరీక్ష రాయించారు. ఇందులో ప్రశాంత్ తప్ప అందరిని సిట్ అరెస్ట్ చేసింది. అక్టోబర్ మొదటి వారంలో ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి పేపర్ లీక్ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న రమేశ్, షమీమ్, సురేశ్ వారిని బ్లాక్మెయిల్ చేసి పేపర్ను తీసుకున్నట్టు అనుమానాలు రావడంతో ఆ దిశగా విచారిస్తున్నారు. స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగానే గ్రూప్-1 పేపర్ను లీక్ చేసి, ఆ నలుగురికి అందించినట్టు ప్రధాన నిందితులు ఇప్పటికే వెల్లడించారు. బ్లాక్మెయిల్ చేసింది ఈ ముగ్గురా? ఇతరులెవరైనా ఉన్నారా? అనే విషయాలను సిట్ పరిశీలిస్తుంది. కస్టడీలో ఉన్న నిందితుల కాల్డాటాను విశ్లేషించి, ఈ ముగ్గురికి పేపర్ వచ్చిన తరువాత ఎవరెవరు కలిశారు, అందులో పరీక్ష రాసిన వారెవరు, వారికొచ్చిన మార్కులు ఎన్ని అనే అంశాలను శాస్త్రీయంగా సేకరిస్తున్నారు. బుధవారం ముగ్గురిని వేర్వేరుగా విచారించి, సాధారణ విషయాలను రాబట్టారు. రెండోరోజు శాస్త్రీయంగా సేకరించిన ఆధారాలను వారి ముందు ఉంచి ఆయా అంశాలను నిర్ధారించనున్నారు.
పేపర్ లీకేజీ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న రేణుక, ఆమె భర్త ఢాక్యా, సోదరుడు రాజేశ్వర్ పేపర్ను విక్రయించి భారీగా డబ్బులు సేకరించిన విషయం తెలిసిందే. వీరితోపాటు పేపర్ను కొని పరీక్ష రాసిన నీలేశ్నాయక్, గోపాల్నాయక్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యను సిట్ అరెస్టు చేసింది. రేణుక తల్లి సర్పంచ్ కావడంతో గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులను ఆమె సోదరుడు రాజేశ్వర్ పర్యవేక్షిస్తుండేవాడు. ఈ పనులకు కాంట్రాక్టర్గా తిరుపతయ్య వ్యవహరించేవాడు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ఏఈ ప్రశ్నపత్రం తమ వద్ద ఉన్నదని పరీక్ష రాసే వారికి దానిని అమ్మేందుకు తిరుగుతున్నామని రాజేశ్వర్ తిరుపతయ్యకు చెప్పాడు. ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్ గురించి తిరుపతయ్య చెప్పడంతో వారిద్దరికి రాజేశ్వర్ తన బావ ఢాక్యనాయక్తో కలిసి పశ్నపత్రాలు అందించి లక్షలు తీసుకున్నట్టు సిట్ విచారణలో తేలింది.