హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది.
అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ను అక్టోబర్ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్పీ తెలిపింది. మెయిన్స్ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.