హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు.
జూనియర్ లెక్చరర్ పోస్టులకు రాత పరీక్షను వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలైలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో 1,100 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పుడు కేవలం తెలంగాణలోనే 1,392 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడటం విశేషం. రాష్ట్రంలో 80,039 కొలువులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న విషయం తెలిసిందే.
గణితంలో అత్యధికం
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం గణితం సబ్జెక్టులో అత్యధికంగా 163 పోస్టులు భర్తీ చేయనున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి మల్జీజోన్-1లో 85 పోస్టులు, మల్టీజోన్-2లో 63 పోస్టులు, ఉర్దూ మీడియంలో మల్టీజోన్-1లో 8, మల్టీజోన్-2లో 1 కలిపి మొత్తం 163 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంగ్లిష్ సబ్జెక్టులో అత్యధికంగా 153 పోస్టులు భర్తీ చేయనున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో భారీ నోటిఫికేషన్ వెలువడటంతో పోస్టు గ్రాడ్యుయేట్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.