హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పరీక్షను జూలై 1న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ గురువారం ప్రకటించింది. గ్రూప్-4లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కుల చొ ప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉం టుంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్), మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2(సెక్రటేరియల్ ఎబిలిటీస్) పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో పరీక్ష ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఎంచుకొన్న భాషకు సంబంధించిన ప్రశ్నపత్రం ఇస్తామని తెలిపారు. అభ్యర్థులకు సందేహాలుంటే https://www.tspsc.gov.in లేదా 040-22445566ను సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుకు నేడు ఆఖరు
గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తులకు గడువు శుక్రవారం ముగియనున్నది. మొదట 25 విభాగాల్లో 8,039 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 30 వరకు అప్లికేషన్లకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత జనవరి 28న బీసీ గురుకులాల్లో కొత్తగా 141 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను జత చేయడంతో ఫిబ్రవరి 3కు దరఖాస్తు తేదీని పొడిగించారు. గురువారం వరకు తొమ్మిది లక్షల దరఖాస్తులు దాటాయి.