హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ఖరారుచేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత నోటిఫికేషన్ను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 563 పోస్టులతో ఈ నెల 19న కొత్తగా గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగుతున్నది.
అభ్యర్థులు మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ను మే లేదా జూన్ మాసాల్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో వెల్లడించింది. అయితే సోమవారం ఇతర పరీక్షలు సహా పలు అంశాలపై చర్చించి ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారుచేసింది. తాజా సమాచారం ప్రకారం జూన్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రంలో మొత్తం 150 ప్రశ్నలుంటాయని తెలిపారు.
ఓఎమ్మార్ పద్ధతిలోనే..!
తాజా అంచనాల ప్రకారం గ్రూప్-1 ప్రిలిమ్స్ను ఓఎమ్మార్ పద్ధతిలోనే నిర్వహించే అవకాశముంది. గత వారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ పరీక్షను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. ఆఫ్లైన్లో ఓఎమ్మార్ పద్ధతిలో నిర్వహిస్తే 33 జిల్లాల్లో, ఆన్లైన్లో నిర్వహిస్తే పాత ఉమ్మడి పది జిల్లాల్లో పరీక్షాకేంద్రాలను కేటాయిస్తామని వెల్లడించింది. తాజాగా స్వీకరిస్తున్న దరఖాస్తుల్లోను అభ్యర్థులు ఆఫ్లైన్కు, ఆన్లైన్కు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే జిల్లాలను ఎంచుకునే అవకాశమిచ్చింది.
గతంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్కు 3.8 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఒకేరోజు ఇంతమందికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం సాధ్యంకాదని, రెండు మూడు రోజులు పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేరోజు పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంటున్న నేపథ్యంలో అది ఓఎమ్మార్ పద్ధతిలోనే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీఎస్పీఎస్సీ ఇంకా స్పష్టతనివ్వలేదు.