హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వాయిదా పడిన, రద్దయిన పరీక్షల నిర్వహణపై వారం రోజులుగా టీఎస్పీఎస్సీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. పరీక్షల తేదీల ఖరారు, ప్రకటన, కొత్త సంస్కరణలు ఎజెండాగా మంగళవారం కమిషన్ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి నేతృత్వంలో కీలక సమావేశం జరుగనున్నట్టు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత మళ్లీ నిర్వహించనున్న పరీక్ష తేదీలు ప్రకటించనున్నట్టు సమాచారం. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీతో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(వర్క్స్) గ్రేడ్-2 ఉద్యోగాల పరీక్షలను రద్దు చేసింది. ఇందులో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్టు కమిషన్ గతంలోనే ప్రకటించింది. మిగిలిన ఐదు పరీక్ష తేదీలను మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నది. మే నెల నుంచి పరీక్షలు తిరిగి నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నది. అందులోనూ తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహించే పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.