TSPSC Paper Leakage |హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే సీబీటీ మోడ్లో కొన్ని పరీక్షలు జరుపుతుండగా, భవిష్యత్తులో అన్ని పరీక్షలను నిర్వహించాలని చూస్తున్నది. ప్రశ్నపత్రాల తయారీ, భద్రతతోపాటు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే దిశగా ప్రణాళికలు రచిస్తున్నది.
భారీ సంఖ్యలో ప్రశ్నలను రూపొందించి, అభ్యర్థుల సంఖ్యను బట్టి అప్పటికప్పుడు ఏ ప్రశ్నలు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నది. దీనివల్ల ప్రశ్నపత్రాల లీకేజీ అనేది ఉండబోదని భావిస్తున్నది. టీఎస్పీఎస్సీ 25 వేలలోపు దరఖాస్తులు వస్తేనే సీబీటీ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నది. ఆ సంఖ్యను 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని కమిషన్ భావిస్తున్నది. దేశంలో కొన్ని రాష్ర్టాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో సీబీటీ పద్ధతి ఇప్పటికే అమల్లో ఉన్నది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), ఐబీపీఎస్లు సైతం ఇప్పటికీ సీబీటీ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆ కమిషన్లు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నాయి? పరీక్షల నిర్వహణ ఎలా ఉన్న ది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా యి? అనే విషయాలపై టీఎస్పీఎస్సీ అధ్యయనం చేస్తున్నది. అత్యుత్తమమైన వి ధానాలను తీసుకొచ్చేందుకు మేధోమథనం జరుపుతున్నది.
తెలంగాణలో పోటీ పరీక్షలకు అనూహ్య స్పందన వస్తున్నది. 50 వేల కెపాసిటీ మాత్రమే ఉంటే.. అంతకుమించి అభ్యర్థులు ఉంటే పరీక్షలు ఎలా నిర్వహించాలనే విషయమై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి నేతృత్వంలో కమిషన్ ప్రతిరోజు సమావేశమై చర్చిస్తున్నది. నార్మలైజేషన్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నది. 50 వేల కంటే ఎక్కువ లేదా లక్షల్లో దరఖాస్తులు వస్తే విడతలవారీగా పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో సెట్లుగా పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నది. ఇప్పటికే ఇలా ఎంసెట్, ఐఐటీ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దీనివల్ల కొందరికి సులభ ప్రశ్నలు, మరికొందరికి కఠిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వ్యత్యాసాన్ని బ్యాలెన్స్ చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలుచేయాలని అనుకుంటున్నది. ఉదయం 500 మందికి పరీక్ష నిర్వహిస్తే.. అందులో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్ డీవియేషన్ పద్ధతిలో తీసుకొని మార్కులను లెక్కిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 500 మంది హాజరైతే.. అందులో గరిష్ఠంగా మార్కులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాను తీసుకొని మార్కులు లెక్కిస్తారు. ఇప్పటికే కొన్ని పరీక్షలకు ఈ పద్ధతిని అమలు చేస్తుండటంతో అభ్యర్థుల్లోనూ ఎటువంటి గందరగోళం ఉండదని కమిషన్ భావిస్తున్నది. అవసరమైతే ఈ విధానం గురించి మరింత అవగాహన కల్పించాలని అనుకుంటున్నది.