TSPSC | నాడు కండ్ల ముందే ఉద్యోగాలను ఎత్తుకుపోతుంటే సగటు తెలంగాణ ఉద్యోగార్థి గుండె చెరువైంది.. భవిష్యత్తును బూడిద చేస్తున్నరేందని ఆగమైండు.. తెలంగాణ రావాలని, మన ఉద్యోగాలు మనకు దక్కాలని దాన్నే నినాదంగా చేసుకున్నడు.. ఉద్యమ సారథి కేసీఆర్ నేతృత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని నినదించి తెలంగాణ సాధించుకున్నడు.. దీంతో ‘నియామకాలు’ అన్న నినాదానికి సార్థకత ఉండాలని టీఎస్పీఎస్సీ ఎంతో కష్టపడింది. ఒకవైపు 95% ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలకే దక్కాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తే, అనుకున్నట్టు నియామకాలు పారదర్శకంగా సాగేలా చూసింది టీఎస్పీఎస్సీ.
ఉద్యమ నినాదానికి 100% న్యాయం చేసింది. మొత్తంగా ఉద్యోగాల భర్తీలో నిఖార్సైన రూపంగా అవతరించింది. తిండి తినక, రాత్రింబవళ్లు కష్టపడి చదువుకొని కొలువులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగులే ఈ మాటలు అంటున్నారు. పేదోళ్లకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలన్న గొప్ప లక్ష్యంతో కనీస వయోపరిమితిని పెంచారని, పరీక్ష ఫీజు తగ్గించారని, అక్రమాలు, అవినీతి లేకుండా చర్యలు తీసుకొని తమ లాంటి వారిని ప్రభుత్వ పీఠాల్లో కూర్చోబెట్టిందని చెప్తున్నారు. – నమస్తే తెలంగాణ నెట్వర్క్
– సిరిపురం గిరి, డిప్యూటీ తాసిల్దార్, మంథని (2016 గ్రూప్ -2 విజేత)
‘టీఎస్పీఎస్సీ అంటే పారదర్శకంగా పోస్టుల భర్తీకి కేరాఫ్ అని చెప్పక తప్పదు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత పురుడు పోసుకున్న టీఎస్పీఎస్సీ ప్రప్రథమంగా 2016లో చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పకడ్బందీగా జరిగింది. అక్రమాలకు తావు లేకుండా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పదేండ్ల నా ప్రిపరేషన్కు న్యాయం జరిగింది. గ్రూప్-2లో మంచి ర్యాంకును సంపాదించి డిప్యూటీ తాసిల్దార్గా బాధ్యతలు స్వీకరించా. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన రిక్రూట్మెంట్ నాలాంటి ఎందరి జీవితాలకో వెలుగునిచ్చింది’ అని అంటున్నారు మంథని మండలంలో నాయబ్ తాసిల్దార్గా పనిచేస్తున్న జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపెల్లికి చెందిన సిరిపురం గిరి. ‘మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ-నాన్న వ్యవసాయం చేసేవారు. అన్న, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ప్రాథమిక విద్య, ఇంటర్, డిగ్రీ రాయికల్, జగిత్యాలలో పూర్తి చేశా. 2001లో ఉమ్మడి రాష్ట్రం నిర్వహించిన డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరా. 2004లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాశా. కానీ, సాధించలేకపోయా. 2007 నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతూనే ఉన్నా.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీని పూర్తి స్థాయిలో చేపట్టకపోవటంతో అనుకున్న లక్ష్యం సాధించలేకపోయా. సొంత రాష్ట్రం వచ్చాక టీఎస్పీఎస్సీ.. 2016లో గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటికి నేను దరఖాస్తు చేసుకొని సన్నద్ధమయ్యా. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. అయినా పట్టుదలతో సన్నద్దమయ్యా. 2016లో ఇచ్చిన నోటిఫికేషన్కు 2017లో రాత పరీక్ష నిర్వహించారు. దాన్ని పకడ్బందీగా డిస్క్రిప్షన్ పద్ధతిలోనే నిర్వహించారు. దీంతో ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశాలు లేకుండా పోయాయి. దీనికి తోడు నాలుగు పేపర్లలో ప్రశ్నలన్నీ అప్లికెబుల్ పద్ధతిలో ఇవ్వడంతో అభ్యర్థులు జవాబులు కచ్చితంగా అదే పద్ధతిలో రాయాల్సి వచ్చింది. అన్ని ప్రశ్నలు చర్చలు, అభిప్రాయాల కోణంలోనే ఇచ్చారు. దీంతో సిలబస్ను ఆమూలాగ్రం చదివి అవగాహన చేసుకున్న వారు మాత్రమే విజయం సాధించే పరిస్థితి ఏర్పడింది. 2018లో ఫలితాలు వచ్చాయి. 75 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. దాని కోసం పది బోర్డులను టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసింది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థిని ఏ బోర్డు ఇంటర్వ్యూ చేస్తుందన్న విషయం ఇంటర్వ్యూకు 5 నిమిషాల ముందే కేటాయించారు. దీంతో ఇంటర్వ్యూ బోర్డులు సైతం నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన స్థితి ఏర్పడింది. 2020లో పోస్టింగ్ ఇచ్చారు’ అని వెల్లడించారు.
– వ్యవసాయ శాఖ ఏఈవో కొండ మీనా (2016-ఏఈవో నోటిఫికేషన్)
– షేక్ సుష్మా, మండల పంచాయతీ అధికారి (2016 గ్రూప్-2 )
‘తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి. ఎలాంటి అవకతవకలు, పైరవీలకు తావివ్వకుండా తెలంగాణ సర్కార్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 2016లో సుమారు 1091 ఉద్యోగాలకు గ్రూప్-2 నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో నేను హైదరాబాద్లో సుమారు 6 నెలల పాటు కోచింగ్ తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఎంపీవోగా ఉద్యోగం సంపాదించాను. ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం సాధించాను. పారదర్శకంగా నియామకాలు చేపట్టారు కాబట్టే నా కష్టానికి ప్రతిఫలం దొరికింది’ అని పేర్కొన్నారు.
– భూపాలపల్లి ఎంపీడీవో శ్రీనివాస్ (2016-గ్రూప్-1 నోటిఫికేషన్)
ప్రతిభ ఉన్నవారు ఎప్పుడూ మనోైస్థెర్యాన్ని కోల్పోవద్దని, వదంతులు బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీఎస్పీఎస్స్ ద్వారా 2017లో ఎంపీడీవోగా ఉద్యోగం సాధించిన కమటం శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ చిన్ననాటి నుంచి ఏదైనా మంచి ఉద్యోగం సాధించాలనే పట్టుదల కలిగి ఉండేవారు. సోదరుడు రవీందర్, సోదరి ఉ మాదేవి ప్రోత్సాహంతో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించినప్పటికీ, ఉన్నతమైన ఉ ద్యోగం సాధించాలనే తపన ఆయనను ఎంపీడీవోగా ఉద్యోగం సాధించేందుకు దోహ దం చేసింది. ‘2011లో ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి నా కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. తిరిగి 2016లో మరోసారి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఇంటర్వ్యూకు వెళ్లిన సందర్భంలో అప్పటి టీఎస్పీఎస్స్ చైర్మన్ ఘంటా చక్రపాణి సర్ 39 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను. పేదరికం, కష్టాలు అనుభవించిన నాకు ఉద్యోగం సాధించేందుకు ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం కనిపించలేదు. అంతా పారదర్శకంగానే సాగాయి. వదంతులు పట్టించుకోవద్దు. మానసిక ైస్థెరాన్ని కోల్పోకుండా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిభ ఉన్నవారు ఎన్నిమార్లు పరీక్షలు పెట్టినా తప్పనిసరిగా విజయం సాధిస్తారనే నమ్మకంతో ముందుకు సాగాలి’ అని తెలిపారు.
– ఏఈవో గుగులోత్ సురేశ్ (2016- ఏఈవో నోటిఫికేషన్)
‘మాది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా. మా తల్లిదండ్రులు కస్సునాయక్, మాలీ. మాది వ్యవసాయ కుటుంబం. తోడ పుట్టిన వాళ్లందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్లే. కుటుంబంలో చిన్నవాడినైన నాకు అంగవైకల్యం ఉండడంతో నడవలేని పరిస్థితి. నిజామాబాద్లోని ఆర్మూరులో అగ్రికల్చరర్ డిప్లొమా పూర్తి చేశా. 2013-16 వరకు ఖమ్మం, వైరా, మధిరలో ఆత్మ ప్రాజెక్ట్ ప్రోగ్రాం మేనేజర్గా పనిచేసిన. ఈ క్రమంలో 2016లో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 311 ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేసుకొన్నా. ఆ పరీక్ష రాసి 2017లో బయ్యారం ఏఈవోగా నియమితుడినయ్యా. టీఎస్పీఎస్సీ నిష్పక్షపాతంగా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్లే పేద గిరిజన కుటుంబంలో పుట్టిన నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొంది నేడు వివిధ రంగాల్లో తమ సేవలందిస్తున్నారు’ అని సురేశ్ తెలిపారు.
– వినయ్, జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్)
‘టీఎస్పీఎస్సీతోనే నిరుద్యోగుల కల సాకారమవుతున్నది. నాకు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. ఎవరో చేతకాని దద్దమ్మలు పేపర్ లీకేజీ చేసి బోర్డు పారదర్శకతను దిగజార్చాలని చూస్తున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాను. నా ప్రయత్నమే నాకు విజయాన్నిచ్చింది. ఉన్నపలంగా బోర్డుమీద, వ్యవస్థపై అసహనానికి గురికాకుండా నిరుద్యోగులు పారదర్శకంగా ఆలోచించాలి’ అని జోగులాంబ గద్వాల జిల్లా ధరూరుకు చెందిన వినయ్ తెలిపారు. తాను చాలా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని, రాసిన పోటీ పరీక్షల్లో విఫలమైనా కష్టపడి చదివానని గుర్తు చేసుకున్నారు. చివరికి జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో అర్హత సాధించి, ఉద్యోగం సంపాదించానని వెల్లడించారు. తన తల్లిదండ్రులు నిరుపేదలని, లంచాలిచ్చి ఉద్యోగం కొనేంత స్థోమత లేదని స్పష్టం చేశారు. కష్టపడి చదివి ఈ ఉద్యోగం తెచ్చుకొన్నానని పేర్కొన్నారు.
– సంతోష్ యాదవ్, నిర్మల్ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ అండ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ (2017-18 నోటిఫికేషన్)
టీఎస్పీఎస్సీ పారదర్శకత వల్లే తాను గురుకుల టీచర్ ఉద్యోగం సంపాదించానని, అందుకు బోర్డుకు రుణపడి ఉంటానని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజీ (టీ)కి చెందిన సంతోష్ యాదవ్ తెలిపారు. ‘మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. విద్యాభ్యాసమంతా సర్కారు విద్యాసంస్థల్లోనే సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యోగం వస్తుందన్న ఆశ లేకుండే. పెండ్లి చేసుకొని, జిల్లా కేంద్రంలో కిరాయి రూమ్లో ఉంటూ స్టేట్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ నెట్టుకువచ్చిన. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు పడ్డాయి. 2017-18లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటు ఫ్యాకల్టీగా పనిచేస్తూనే ప్రిపరేషన్ కొనసాగించిన. ఉస్మానియా క్యాంపన్లో హిస్టరీలో పీజీ 18వ ర్యాంకు సాధించిన నేను సోషల్ స్టడీస్పై పూర్తి దృష్టిపెట్టిన. తెలుగు అకాడమీ పుస్తకాలు, 1969 నుంచి తెలంగాణ ఉద్యమాలు, ముఖ్య ఘట్టాలు, కరెంట్ ఎఫైర్స్ చదివా. నా కష్టానికి ఫలితం దక్కింది. ఫలితాలు వచ్చిన రోజు చాలా సంతోషపడ్డా. గురుకుల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నిర్మల్ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న’ అని సంతోష్ తెలిపారు.
– కాసం ప్రవీణ్, ఏఎస్వో, తెలంగాణ సచివాలయం(2016 గ్రూప్ -2 విజేత)
ఉద్యోగ కల్పనలో పారదర్శకతకు టీఎస్పీఎస్సీకి కేరాఫ్గా నిలుస్తున్నదని, యూపీఎస్సీ తరహాలో సిలబస్ను రూపకల్పన చేశారని తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న కాసం ప్రవీణ్ తెలిపారు. ‘2016లో నిర్వహించిన గ్రూప్-2కు సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. ఓ ప్రైవేట్ మీడియా సంస్థలో ఉద్యోగం చేస్తూనే బాగా కష్టపడ్డాను. తెలుగు అకాడమీ పుస్తకాలనే చదివాను. కష్టపడి చదివి విజయం సాధించాను. అవకతవకలకు తావులేకుండా ఎంతో పారదర్శకతతో టీఎస్పీఎస్సీ నియామకాలు చేపట్టింది. అయితే 2016లోనే పోస్టింగ్లో చేరాల్సిన మేము, 2019లో చేరాల్సి వచ్చింది. దీనికి కారణం కొందరు అభ్యర్థులు బబుల్స్ సరిగా చేయలేదని, తమను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు వెళ్లడమే. ప్రతి ఉద్యోగార్థి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టపడి చదవాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి’ అని పేర్కొన్నారు.
– ఉండేటి జ్యోతి, సీడీపీవో, దమ్మపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్, భద్రాద్రి జిల్లా(2017 సీడీపీవో నోటిఫికేషన్)
టీఎస్పీఎస్సీ నియామక ప్రక్రియ అంతా మెరిట్ ప్రకారమే జరగటంతో తాను ఉద్యోగం సంపాదించానని భద్రాద్రి జిల్లా దమ్మపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో ఉండేటి జ్యోతి తెలిపారు. ‘మా స్వస్థలం పాల్వంచ. నేను ఒకటో తరగతి నుంచి ఉన్నత చదువుల వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్నాను. 2017లో సీడీపీవో పోస్ట్లకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018లో నేను పరీక్ష రాశాను. 450 మార్కులకు ఆన్లైన్ పరీక్ష జరిగింది. నేను క్వాలిఫై అయ్యాను. మెరిట్ లిస్ట్ను ఆన్లైన్లో పొందుపరిచారు. మరో 50 మార్కులకు ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఇంటర్యూ చేసిన అధికారికి మా హాల్టికెట్ నంబర్ కూడా తెలియదు. అంత పారదర్శకంగా ఇంటర్వ్యూలు జరిగా యి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గాను. 2018లో నేను సీడీపీవోగా పోస్టింగ్ ఆర్డర్ అందుకున్నాను. ప్రస్తుతం దమ్మపేట ఐసీడీఎస్ సీడీపీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించి ఉండకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్నే కాదు. టీఎస్పీఎస్సీపై పూర్తి నమ్మకం ఉంచి ఉద్యోగార్థులు కష్టపడి చదవాలి’ అని పేర్కొన్నారు.
– తెలుగు పండిట్ నడింపల్లి శ్రీనివాస్ (2017 నోటిఫికేషన్)
‘కష్టపడి చదివా. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల కావటంతో దరఖాస్తు చేసుకున్నా. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించటంతో నా కష్టానికి ఫలితం దక్కింది’ అని అంటున్నారు నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామెరకు చెందిన నడింపల్లి శ్రీనివాస్.
‘నేను చదువుకుంటున్నప్పుడే పెండ్లి అయ్యింది. ప్రైవేట్ స్కూళ్లలో చదువు చెప్తూనే 2014లో ఎంటీపీటీ పూర్తి చేశా. సర్కారు బడుల్లో విద్యావలంటీర్గా పనిచేశా. లక్ష్యం కోసం సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివాను. నా భార్య సంతోష కూడా చిన్న చిన్న పనులు చేస్తూ సహాయం చేసింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018లో పరీక్షలు జరగ్గా జిల్లా స్థాయిలో 11వ ర్యాంకు సాధించాను. ఇప్పుడు నాంపల్లి మండలంలోని పసునూరు గ్రామ జిల్లా పరిషత్తు పాఠశాలలో తెలుగు పండిట్గా విధులు నిర్వహిస్తున్నా. ఎటువంటి పైరవీలు, మధ్యవర్తిత్వం లేకుండా టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించటం వల్లే నేను ఉద్యోగం దక్కించుకున్నా’ అని శ్రీనివాస్ తెలిపారు.