TSPSC | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై వస్తున్నవన్నీ అపొహలేనని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. పరీక్ష నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరుగలేదని హైకోర్టుకు వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషర్ల తరపు న్యాయవాది ప్రస్తావించిన ప్రధాన మూడు (నందిని వ్యవహారం, గ్రూప్-1కు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో తేడా, బయోమెట్రిక్ హాజరు) అంశాలపై టీఎస్పీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. పరీక్ష రాసిన ఓ అభ్యర్థి పేరు ఎర్రబోజు నందిని. ఆమెకు వివాహం కావడంతో ఇంటిపేరు కొత్వాల్గా మారింది. వివాహ ధ్రువీకణ పత్రం కొత్వాల్ పేరుతోనే ఉన్నది. వివాహానికి ముందే చదువు పూర్తవడంతో ఎర్రబోజు ఇంటి పేరు మీదే సర్టిఫికెట్లున్నాయి. గ్రూప్-1కు దరఖాస్తు చేస్తూ.. సంతకం అప్లోడ్ సమయంలో కే నందిని పేరుతో సంతకం చేసింది. కానీ, దరఖాస్తులో మాత్రం ఎర్రబోజు నందినిగానే ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకున్న ముగ్గురు అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారులు ఒకరికి బదులుగా మరొకరి చేత గ్రూప్-1 పరీక్షను రాయించినట్టుగా అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. నందిని మ్యారేజ్ సర్టిఫికెట్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను గురువారం హైకోర్టుకు ఏజీ సమర్పించారు. అభ్యర్థుల వాదనలో అర్థంలేదని పేర్కొన్నారు.
గ్రూప్-1 పరీక్ష జరిగిన రోజు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యపైనా అభ్యంతరాలు తెలిపారు. పరీక్షరోజు ఇచ్చిన పత్రిక ప్రకటనలో 2,33,248 మందిగా, ఆ తర్వాత ఓఎమ్మార్ షీట్లను స్కాన్చేయగా 2,33,506 ఉన్నట్టుగా తేలాయని, అంటే… మరో 258 మంది ఎలా అదనంగా రాశారని కోర్టులో ప్రస్తావించారు. మొదట ఫోన్లో తీసుకున్న సమాచారం ప్రకారం 2,33,248 మంది రాసినట్టుగా తేలిందని, ఇది తాత్కాలిక సంఖ్యయేనని, దీనిని ప్రామాణికంగా తీసుకోరాదని, ఓఎమ్మార్ షీట్లే ప్రామాణికమని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎన్నికల సమయంలోను మొదట ఒక పోలింగ్ శాతానికి ప్రకటించి, తర్వాత రోజు పూర్తిగా లెక్కించి, పూర్తి పోలింగ్శాతాన్ని ప్రకటించినట్టుగా తాము చేశామని ఏజీ వివరించారు.
బయోమెట్రిక్ హాజరు అంశంపైనా ఏజే వాదనలు వినిపించారు. అభ్యర్థులను పూర్తిగా పరిశీలించాకే పరీక్షకు అనుమతించామని చెప్పారు. మూడు రకాల చెక్పాయింట్ల ద్వారా పూర్తి పరిశీలన జరిపామని తెలిపారు. పరీక్షహాల్లో ఇన్విజిలేటర్ నాలుగైదు రకాల ఐడెండిఫికేషన్ను పరిశీలించారని గుర్తు చేశారు. హాల్టికెట్ మీద అభ్యర్థి ఫొటో, ప్రభుత్వ ఐడీ కార్డు (ఆధార్, పాస్పోర్టు, పాన్కార్డుపై ఫొటో), అటెండెన్స్ షీట్ (నామినల్రోల్పై) దరఖాస్తు చేసినప్పటి ఫొటో, అభ్యర్థి సంతకం, హాల్టికెట్ మీద సంతకం, ఫొటో, ముఖాన్ని పరిశీలించారని వెల్లడించారు. అటెండెన్స్షీట్పై సంతకం, అభ్యర్థి పేరు రాయించడం, ఇన్విజిలేటర్ సంతకం వంటి పటిష్ట చర్యలను తీసుకున్నామని వాదించారు. ఈ చర్యలతో ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసేందుకు అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఆఖరు నిమిషంలో గుంపుగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష సమయం దగ్గరపడుతున్నప్పుడు బయోమెట్రిక్ తీసుకోవడమా.. పరీక్ష నిర్వహించడమా అన్న సమస్య ఉత్పన్నమవుతుందని, కొందరికి బయోమెట్రిక్ తీసుకోవడం, మరికొందరికి తీసుకోకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నందునే బయోమెట్రిక్కు బదులుగా ఇతర మార్గాల ద్వారా అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేసినట్టుగా వాదనలు వినిపించారు. తాజాగా గ్రూప్ -4లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్నామని హైకోర్టుకు తెలిపారు.