హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన లీక్ వీరులు మొదటి ర్యాంకు సాధించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీకేజీ చేసి డివిజనల్ అకౌంట్స్ అఫీసర్ (డీఏవో) పరీక్ష రాసిన ముగ్గురు టాపర్లుగా నిలిచారని తేలింది. ఈ కేసులో ఇది వరకే అరెస్టయిన రాజశ్వేర్కు మొదటి ర్యాంకు, అతని భార్య శాంతికి రెండో ర్యాంకు, రేణుక స్నేహితుడైన నూతన్ రాహుల్కు మూడో ర్యాంకు వచ్చినట్టు వెల్లడైంది. కీలక నిందితుడైన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డి భార్య సుచరిత కూడా పరీక్ష రాసినట్టు విచారణలో తేలింది. దీంతో శాంతి, రాహుల్, సుచరితతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన రమావత్ దత్తులను బుధవారం సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇది వరకే అరెస్టయిన రేణుక, ఆమె సోదరుడు రాజేశ్వర్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా సిట్ భిన్న కోణాలలో ఒక్కో పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం, ఆ పరీక్ష రాసిన వారు, దరఖాస్తు చేసుకొన్న వారి వివరాలపై భిన్న కోణాలలో దర్యాప్తు చేస్తూ ముందుకుసాగుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 34 మంది నిందితులను అరెస్టు చేసింది.