హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ పదవికి బీ జనార్దన్రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ సీఎస్ శాంతికుమారికి పంపారు. జనార్దన్రెడ్డి తొలుత సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లు సహా పలు అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత జనార్దన్రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. ఐఏఎస్ అధికారిగా ఉన్న జనార్దన్రెడ్డిని 2021, మే 20న టీఎస్పీఎస్సీ చైర్మన్గా అప్పటి ప్ర భుత్వం నియమించింది. మే 21న ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కమిషన్లో బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కోట్ల అరుణకుమారి, సుమిత్రానంద్ తనో బా సభ్యులుగా కొనసాగుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జనార్దన్ రెడ్డి ఓయూలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్-1కు ఎంపికై డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగంలో చేరారు. నల్లగొండ, నెల్లూ రు ఆర్డీవోగా, వరంగల్, అనంతపురం కలెక్టర్గా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్, మార్కెటింగ్ శాఖలతోపాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్గా పనిచేశారు. విద్యాశాఖ సెక్రటరీగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ సర్కారు ఆయనను టీఎస్పీఎస్సీ చైర్మన్గా అప్పటి నియమించింది.