హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఇంజినీర్ల పదోన్నతులకు నష్టం కలుగకుండా చూడాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే ఇచ్చిన పదోన్నతులను వెనక్కి తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి పీ సదానందంతో కూడిన ప్రతినిధుల బృందం బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాససముదాయంలో విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఉద్యోగుల విభజన సమయంలో ఏపీకి వెళ్లిన ఉద్యోగుల రాకతో సీనియార్టీ కోల్పోవడమే కాకుండా, భవిష్యత్తులో పదోన్నతులు వచ్చే అవకాశాలు లేవని, కావున తగు న్యాయం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ప్రతి ఇంజినీర్కు పదోన్నతి లభించిందని, అదనపు బాధ్యతలతో 24 గంటలు పనిచేసి నిరంతర విద్యుత్తును అందించేందుకు శ్రమించారని గుర్తుచేశారు. పదోన్నతుల అంశంపై సీఎం కేసీఆర్తోపాటు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి న్యాయం చేస్తామని జగదీశ్రెడ్డి హామీ ఇచ్చినట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఎస్పీఈఏ అసోసియేట్ ప్రెసిడెంట్ ఏ వెంకటనారాయణరెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి అంజయ్య, కిరణ్కుమార్, సత్యనారాయణరాజు, వీ గోపాల్రావు, బాగయ్య, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.