హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర న్యాయ సేవా సంస్థ శుక్రవారం బాల సదనాల్లోని పిల్లలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బాలసదనాల్లో ఉన్నవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దాట్ల గ్రామానికి చెందిన అవిభక్త కవలలు వీణావాణీతో ఆమె ముచ్చటించారు. బాలికలపై హింస, అందుకు ఉన్న శిక్షలు, చట్టాలు, జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి తదితర అంశాలపై మాట్లాడారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో జిల్లా న్యాయసేవా సంస్థలు.. వివిధ ప్రభుత్వ శాఖల్లో మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై వారంపాటు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర న్యాయసేవా సంస్థ కార్యదర్శి, జస్టిస్ జీ అనుపమ చక్రవర్తి తెలిపారు. సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, డైరెక్టర్ బీ శైలజ తదితరులు పాల్గొన్నారు.