TSLPRB | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల రీకౌంటింగ్ ముగిసినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 3,55,387 ఓఎంఆర్ షీట్లుండగా, రీకౌంటింగ్కు 1,338 (0.38%) దరఖాస్తులు అందినట్టు వెల్లడించారు. ఫలితాలు ఆయా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో ఈ నెల 6 నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తుది రాత పరీక్షల ఫైనల్ కీపై అభ్యర్థుల నుంచి 1 నుంచి 3 వరకు రీకౌంటింగ్/ రీ వెరిఫికేషన్కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏ, బీ క్యాటగిరీలలోని అభ్యర్థుల దరఖాస్తులలో తప్పుల సవరణకు 6 నుంచి 8న రాత్రి 8 గంటల వరకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. సీ క్యాటగిరీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని స్పష్టం చేశారు.
త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్
త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభిస్తామని శ్రీనివాసరావు చెప్పారు. 2014 జూన్ 2 తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకొంటామని తెలిపారు. 2021 ఏప్రిల్ 1 తర్వాత అభ్యర్థులు తీసుకొన్న నాన్ క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లనే అంగీకరిస్తామని స్పష్టంచేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం కటాఫ్ మార్కులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వనీయంగా తెలిసింది. అనంతరం కటాఫ్ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్, ఇతర కేసుల వెరిఫికేషన్ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.