హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్రీకృతం కాకుండా జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలవారీగా ప్రభుత్వ భూముల లభ్యతను బట్టి దశలవారీగా 70 చోట్ల నూతన పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసేందుకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఎక్కువ పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమయ్యాయి. పరిశ్రమల ఏర్పాటుకు గత ఎనిమిదేండ్లలో టీఎస్ ఐ-పాస్ ద్వారా జారీ అయిన అనుమతులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఏర్పాటు అనంతరం టీఎస్ ఐ-పాస్ ద్వారా మొత్తం 18,631 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా మేడ్చల్-మల్కాజ్గిరిలో జిల్లాలోనే 4,060 పరిశ్రమలకు అనుమతులు జారీ అయ్యాయి.
అలాగే సంగారెడ్డి జిల్లాలో 1,482, రంగారెడ్డి జిల్లాలో 1,334 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం పరిశ్రమల్లో మూడింట ఒక వంతుకుపైగా పరిశ్రమలు ఈ 3 జిల్లాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. పరిశ్రమలన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు పరిమితం కావడంతో ఉపాధి కోసం హైదరాబాద్కు వలసలు పెరిగాయి. పరిశ్రమలు జిల్లాల్లోనే ఏర్పాటైతే వలసలను చాలావరకు అరికట్టవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలపై దృష్టి కేంద్రీకరించింది. స్థానికంగా లభించే ముడి సరుకు ఆధారంగా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్ఐఐసీ కొత్తగా 70 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. తొలుత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న జిల్లాల్లో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని జిల్లాల్లో సాగుకు యోగ్యంగా లేని భూములను సేకరించి, దశలవారీగా ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు వివరించారు.
కొత్త పారిశ్రామికవాడల వివరాలు ఇవీ..
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మొత్తం 165 పారిశ్రామికవాడల్లో 56 తెలంగాణ ఆవిర్భవించాక అభివృద్ధి చేసినవే. వీటిలో హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతా ల్లో 22 అభివృద్ధి చేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో 34 అభివృద్ధి చేశారు. ఇప్పుడు జిల్లాలవారీగా మరో 70 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటిలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 19 ఏర్పాటు కానున్నాయి. మెదక్ జిల్లాలో 7, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 6, వికారాబాద్ జిల్లాలో 5, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 4, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో 3, వనపర్తి జిల్లాలో 2, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో ఒక్కో పారిశ్రామికవాడ చొప్పున అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.