ముకరంపుర, జనవరి 25: విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిబంధనల మేరకే ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావు చెప్పారు. కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏసీడీ చార్జీలపై వినియోగదారులకు అనేక అపోహలున్నాయని అన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత తమదేనని చెప్పారు.
కొంతమంది వినియోగదారులు ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ వారితో ఘర్షణకు దిగడం, వారిని బంధించడంలాంటి సంఘటనలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఈఆర్సీ 2004లో ఇచ్చిన రెగ్యులేషన్ నం.6 ప్రకారం ఏసీడీ చార్జీలను విద్యుత్తు పంపిణీ సంస్థలు వసూలు చేసుకొనే అధికారం ఉన్నదని వివరించారు. విద్యుత్తు చట్టానికి లోబడి, ఈఆర్సీ నిబంధనల ఆధారంగా విద్యుత్తు బిల్లులు, ఏసీడీ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలను వసూలు చేస్తాయని చెప్పా రు.
వినియోగదారులు 12 నెలలు వాడుకున్న విద్యుత్తు వినియోగాన్ని సరాసరిగా తీసుకొని నెలవారీగా బిల్లును వసూలు చేసినప్పుడు రెం డు నెలల డిపాజిట్ను, బై మంత్లీ బిల్లును వసూలు చేసినప్పుడు 3నెలల డిపాజిట్ను పంపిణీ సంస్థ లు తమ వద్ద ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ డిపాజిట్పై ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్యాంకు రేటు ప్రకారం వడ్డీ లెక్కించి ఆ మేరకు విద్యుత్తు బిల్లులో తగ్గిస్తారని చెప్పారు. ఆ డిపాజిట్ విద్యుత్తు సంస్థ వద్దనే ఉంటుందని తెలిపారు.
ఏసీడీ చార్జీ ఎందుకంటే?
ఎన్పీడీసీఎల్ పరిధిలోనే సుమారు 7.16లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం వల్ల రూ.305 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని శ్రీరంగారావు చెప్పారు. వినియోగదారుల డిపాజిట్ కంపెనీ వద్ద ఉంటే బకాయిలను రాబట్టుకునే అవకాశం ఉండేదన్నారు. రాష్ట్రం లో విద్యుత్తు వినియోగం చాలా పెరిగిందని, దీంతో కొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. నిరుడు ఏప్రిల్ నెలలో రూ.3,200 కోట్లు అదనంగా వెచ్చించి వివిధ క్యాటగిరీల వినియోగదారులకు విద్యుత్తు అందించారని చెప్పారు.
వ్యవసాయ విద్యుత్తు బిల్లులు వసూలు చేయడం లేదని, ప్రభుత్వమే చెల్లిస్తున్నదని తెలిపారు. వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీ రూపంలో కొంత వసూలుచేసి విద్యుత్తు సంస్థలు పూరించుకుంటున్నాయని వివరించారు. పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈఆర్సీగా అన్నింటినీ నియంత్రిస్తామని, తమ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉన్నదని చెప్పారు. వినియోగదారులు అర్థం చేసుకొని ఏసీడీ చార్జీలు కచ్చితంగా చెల్లించాలని అన్నారు. చెల్లించకపోతే సర్వీసును డిస్కనెక్ట్ చేసే అధికారం పంపిణీ సంస్థకు ఉన్నదని స్పష్టంచేశారు.
పవర్ హాలిడే ఇవ్వని రాష్ట్రం తెలంగాణ
రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు దేశం లో ఎక్కడా లేనివిధంగా అన్ని క్యాటగిరీలకు చెందిన వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నాయని శ్రీరంగారావు చెప్పారు. పవర్ హాలిడే ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వా త విద్యుత్తు రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు విద్యుత్తు సంస్థలు, ప్రభుత్వం రూ.38 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. భద్రాద్రి, యాదాద్రి, ఎన్టీపీసీ, సింగరేణిలో వి ద్యుత్తు ఉత్పత్తి కోసం రూ.45 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. రానున్న రోజు ల్లో మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలువనుందన్నారు. పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని కాపాడుతూ అవి నిలదొక్కుకొనేలా చూడాల్సిన బా ధ్యత అందరిపై ఉందనే విషయాన్ని ప్రతి వినియోగదారుడు అర్థం చేసుకోవాలని కోరారు.