హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు భారీగా పడిపోతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నట్టు టీఎస్డీపీఎస్ వెల్లడించింది. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీ(టీ)లో 6.2 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 6.4, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ధరిలో 6.8, సానాలలో 7.2, లోకారిలో 7.5, తలమడుగు మండలం బరంపూర్లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉదయం 10 దాటినా చలి వదలట్లేదు. జనం బయటకు రావట్లేదు. సాయంత్రం ఐదులోపే రైతులంతా పొలాల నుంచి ఇండ్లకు చేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టీ) గ్రామంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. గ్రామాల్లో ఇండ్ల ముందు చలిమంటలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని టీఎస్డీపీఎస్ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మరో మూడు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జీహెచ్ఎంసీలో కుత్బుల్లాపూర్, అల్వాల్, ముషీరాబాద్ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని చోట్ల 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. ఆకాశం నిర్మలంగా ఉంటుందని, ఈశాన్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయని తెలిపింది. రాత్రి నుంచే పొగమంచు కురుస్తుండగా, ఉదయం సమయంలో రోడ్లపై పొగమంచుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
చలి మంట కాగిన మేక పిల్ల
గత పదేండ్ల్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఇగం గజగజలాడిస్తున్నది. చలి తీవ్రతని తట్టుకోలేక ప్రజలు చలిమంటలు కాగుతున్నారు. అయితే, చలి మీకేనా, నాకూ ఉన్నదన్నట్టు జనగామ జిల్లా దేవరుప్పులలోని కొత్తవాడ వద్ద ఓ మేక పిల్ల మంట కాగింది. అక్కడ కొందరు వ్యక్తులు చలికాగి వెళ్లగా.. ఆ తర్వాత మేక పిల్ల వచ్చి మంట వద్ద నిలబడి ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కింది. – దేవరుప్పుల