TSats Chairman Anjaneya Goud | పక్కనే ఉన్న కర్ణాటక, ఏపీ నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించిన మోదీ సర్కార్.. కన్నీళ్ల జిల్లాగా పేరొందిన పడ్డ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వక పోవడం పాలనా పైశాచికమేనని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు పాలమూరు జిల్లాను నాటి పాలకులు వంచిస్తే, పాలమూరును వొడ్డుకు చేరుస్తున్న సీఎం కేసీఆర్కు అడ్డు పడుతున్న మోదీ వర్తమాన విద్రోహిగా దాపురించాడని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2014 నాటికి రెండు లక్షల ఎకరాల కూడా నీరందలేదని ఆంజనేయ గౌడ్ తెలిపారు. కానీ పదేండ్లుగా కేసీఆర్ సర్కార్ దాదాపు 16 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగు నీరు పారిస్తున్న సత్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యయనం చేసి గుజరాత్లో అమలు చేయాలని సూచించారు. నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్లో మహిళలు నీటి కోసం బిందెల యుద్ధం చేస్తున్నారని, అదే తెలంగాణ ఏర్పాటైన తొమ్మిదేండ్లలోనే నీటి సిరుల వెల్లువ సాధ్యమైందన్నారు.
మూడు సార్లు గుజరాత్ సీఎంగా, రెండు సార్లు దేశ ప్రధానిగా ఉన్న మోదీ, స్వరాష్ట్ర ప్రజల నీటి ఇక్కట్లను తీర్చలేకపోయారని ఆంజనేయ గౌడ్ ఎద్దేవా చేశారు. పాలమూరును అహంకార ప్రధాని కన్నులతో కాక, పర్యాటక నయనాలతో చూస్తే, ఆయనకు పచ్చబడ్డ పాలమూరు అనేక పాఠాలు నేర్పుతుందన్నారు. పాలమూరు నీటి దోపిడీ దారులకు మంగళహారతులు పట్టిన నాయకులకు జాతీయ స్థాయి పదవులిచ్చిన మోదీ పార్టీకి పాలమూరు ప్రజల అవసరాలు మాత్రం అర్ధం కాపోవడం విడ్డురమన్నారు.పాలమూరులోప్రధాని పర్యటన ను ఉమ్మడి జిల్లా ప్రజలెవరూ పట్టించుకోవడమే లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కు జాతీయ హోదా తో పాటు ,కృష్ణ నీటి కేటాయింపుల వాటాను తేల్చకుండా పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన.. ముస్సోలినీ పర్యటనలా ఉందని ఆంజనేయ గౌడ్ విమర్శించారు.