వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్15: పాము కాటుకు గురైన ఓ మహిళ.. ఆ పామును చంపి బాటిల్లో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన మిడియం శాంతమ్మ ఉపాధి హామీ పనులు చేస్తుండగా, పాము కాటుకు గురైంది. శాంతమ్మ ఆ పామును చంపి వాటర్ బాటిల్లో వేసుకొని స్థానిక ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. వైద్యులకు కాటు వేసిన పామును చూపించి వైద్యం అందించాలని కోరింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, వైద్యులు, గ్రామస్థులు శాంతమ్మ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.