TS Weather Update | తెలంగాణలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని వివరించింది. ఇదిలా ఉండగా.. మంగళవారం పలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్తో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.