TS Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాలలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.
ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వాలి ఉందని, రాగల రెండు రోజులలో వాయవ్య దిశగా కదిలి ఝార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు వివరించింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని చెప్పింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్తో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.