TS Weather | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర ఒడిశా, దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీసగఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, దాంతోపాటు నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా ఉన్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
బుధవారం నుంచి గురువారం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.