TS Weather | నైరుతి రుతుపవనాల పలకరింపుతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిన అయిన జనం వాతావరణం ఒక్కసారిగా చల్లడడంతో ఊరట పొందుతున్నారు. అయితే, తెలంగాణలో మరో రెండురోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
హైదరాబాద్లో తేలిక పాటి వర్షాలుంటాయని పేర్కొంది. ఉత్తర ఒడిశా, దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.