TS Weather | తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నానికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. ఎండలతో జనం జంకుతున్నారు. మరో వైపు రాగల ఐదురోజుల్లోనూ వేడి, తేమ వాతావరణ పరిస్థితులు ఉంటాయని.. అదే సమయంలో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. ఆదివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది.
ఆ తర్వాత అశ్వాపురం (కొత్తగూడెం) 45.3, మంగపేట (ములుగు) 45.3, తిమ్మాపూర్ (నల్గొండ) 45.2, కొత్తపల్లి గోరి (భూపాలపల్లి) 45.2, ధర్మవరం (ములుగు) 45.2, ఇబ్రహీంపేట (నల్గొండ) 45.1, అలుబాక-జెడ్ (ములుగు) 45.1, పాన్గల్ (వనపర్తి) 45.1, మాటూర్ (నల్గొండ) 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ విభాగం వివరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.