TS Weather | తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. వాతావరణంలోని మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యల్పంగా ఖమ్మంలో 29.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత సిర్పూర్లో 8.3 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. వచ్చే మూడురోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
రాబోయే రెండు రోజులు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి -భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రోజువారి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.6 డిగ్రీలుగా నమోదవుతున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్లో 9.2, మెదక్ 11.6,రామగుండం 13.6, హకీంపేట్ 14.6, దుండిగల్ 14.7, నిజామాబాద్ 15.1, హనుమకొండ 15.5, హైదరాబాద్ 15.5, నల్లగొండ 16.2, మహబూబ్నగర్ 17.6, ఖమ్మం 19.0, భద్రాచలం 19.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.