TS Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలకు తోడు వడగాలులు సైతం వీస్తుండడంతో జనం అల్లాడుతున్నారు. గురువారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో నిడమనూరులో 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రత రికార్డయ్యింది. తీక్య తండా (నల్గొండ)లో 43.4, ధరూర్ (జోగులాంబ) 43.4, పెబ్బేరు (వనపర్తి) 43.3, నాంపల్లె (నల్గొండ) 43.2, కోరట్పల్లి (నిజామాబాద్) 43.1, బుగ్గబావి గూడ (నల్గొండ) 43.1, తిరుమలగిరి (నల్గొండ) 43.1, తెల్దేవరపల్లె (నల్గొండ) 43, వడ్డేపల్లి (జోగులాంబ) 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు టీఎస్డీపీఎస్ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రాగల మూడురోజుల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.