TS Weather | తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామార్డె జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాతో పాటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
బుధవారం నుంచి గురువారం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 9 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది.