TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. సోమవారం నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. మంగళవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల 8న జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు.. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. అలాగే, ఈ నెల 9, 10 తేదీల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది.