TS Weather Alert | హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సహా మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా అక్కడ వానలు పడుతున్నాయి. శుక్రవారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మిగిలిన చోట్ల జల్లులు లేదా మబ్బులు ఉండే అవకాశం ఉందన్నారు.