హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నాయి. మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.695 కోట్ల రుణాలు అందజేయడం విశేషం. రెండో విడత రుణాల పంపిణీలో దేశంలోని తొలి పది స్థానాల్లో అన్నీ తెలంగాణకు చెందిన పట్టణాలే నిలవడం విశేషం. లక్ష నుంచి పది లక్షలలోపు జనాభా ఉన్న పట్ణణాల క్యాటగిరీలో మొదటి మూడు స్థానాలు తెలంగాణకే దక్కాయి.
మూడో విడత రుణాల పంపిణీలో నలభై లక్షలకు పైగా జనాభా ఉన్న క్యాటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నది. గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి చేతుల మీదుగా తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్య అవార్డులు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వీధివ్యాపారులకు రుణాలు అందజేయాలని, స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 ఫిబ్రవరి 24న ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్శాఖ వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా వల్ల నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వారికి వర్కింగ్ క్యాపిటల్ను అందించారు. నిరంతరం మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ, అధికారులకు స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో రుణాల పంపిణీ కార్యక్రమం దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో విజయవంతంగా సాగింది.
లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల క్యాటగిరీలో దేశవ్యాప్తంగా 3,555 పట్టణాలు ఉండగా తొలి పది స్థానాలను తెలంగాణ కైవసం చేసుకున్నది. ఇందులో మొదటి స్థానంలో సిద్దిపేట, రెండో స్థానంలో సిరిసిల్ల ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నిర్మల్, కామారెడ్డి, బోధన్ , జహీరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, పాల్వంచ, ఆర్మూర్ నిలిచాయి. లక్ష నుంచి 10 లక్షల జనాభా క్యాటగిరీలో దేశంలో 442 పట్టణాలు ఉండగా వరంగల్ మొదటి స్థానంలో నిలిచింది. నిజామాబాద్కు 10వ స్థానం దక్కింది. 40 లక్షలపైగా జనాభా ఉన్న క్యాటగిరీలో జీహెచ్ఎంసీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.