TS TET 2023 | పటాన్చెరు, సెప్టెంబర్ 15 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ రాయడానికి చేరుకున్న ఓ గర్భిణి హఠాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇందిరానగర్కు చెందిన రాధిక (32) ఎనిమిది నెలల గర్భిణి. శుక్రవారం భర్త అరుణ్బాబు, తన ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై పరీక్షా కేంద్రానికి వచ్చింది. పరీక్షా సమయం దగ్గరపడుతున్న ఆత్రుతతో గేటు వద్ద నుంచి పరీక్ష హాలు వరకు అతివేగంగా వెళ్లింది.
తనకు కేటాయించిన కుర్చీపై కూర్చున్న ఆమె కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైంది. గురుకుల సిబ్బంది ఆమె బీపీని పరీక్షించగా బాగా పెరిగింది. దీంతో హుటాహుటిన అరుణను అక్కడున్న ఓ కానిస్టేబుల్ కారులో పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి మార్గమధ్యంలోనే మరణించినట్టు నిర్ధారించారు. రాధికకు ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. త్వరలో మూడో కాన్పు కావాల్సి ఉన్నది. అంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.