TS TET | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన టెట్2024 నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)లో నిర్వహించనున్నట్టు తెలిపారు. వివరాలకు http://schooledu.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని డీఎస్సీ కంటే ముందే టెట్ పరీక్ష నిర్వహిస్తామని నిర్ణయించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. టెట్ నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రంలో 7 లక్షలకుపైగా విద్యార్థులు డీఎస్సీ పరీక్షకు అర్హత కోల్పోతున్నారు. విద్యార్థులు ఎదురొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించాలి.’ అని ఈ నెల 12న ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీశ్రావు లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ‘టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.