హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకొంటున్నది. టీచర్ పోస్టుల భర్తీకి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. టెట్ను జూన్ 12న నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. శనివారం నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలకు http://tstet.cgg.gov.in లో సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులను భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017జులైలో టెట్ నిర్వహించారు. గతంలో టెట్ సర్టిఫికెట్కు ఏడు సంవత్సరాలు మాత్రమే విలువ ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం టెట్లో ఒక్కసారి అర్హత సాధిస్తే అది జీవితాంతం వర్తిస్తుంది. టెట్లో వచ్చిన మారులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.
టెట్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ క్యాటగిరీ విద్యార్థులు కనీసం 90 మార్కులు (60%), బీసీలు 75 మార్కులు (50%), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు (40%) మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ను పేపర్-1, పేపర్-2గా నిర్వహిస్తారు. గతంలో పేపర్-1ను డీఈడీ అభ్యర్థులు, పేపర్-2న బీఈడీ అభ్యర్థులు రాసేవారు. ఇప్పుడు బీఈడీ అభ్యర్థులకు పేపర్-1 కూడా రాసే అవకాశం కల్పించారు. అయితే, ఎస్జీటీలుగా (1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు) ఎంపికైన బీఈడీ అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన రెండేండ్లలో ప్రాథమిక విద్యా బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.